
ఆర్టీసీ టోల్ బాదుడు!
● టికెట్పై 20శాతం చార్జీల పెంపు ● స్టూడెంట్ బస్పాస్ చార్జీలు 50శాతం పెంపు ● హైదరాబాద్ మార్గంలో రూ.20 నుంచి రూ.30 వరకు అదనం
కరీంనగర్:
తెలంగాణ ఆర్టీసీ చడీచప్పుడు లేకుండా సాధారణ ప్రయాణికులతో పాటు స్టూడెంట్ బస్పాస్ చార్జీలను భారీగా పెంచింది. స్టూడెంట్ బస్పాస్ కనిష్టధర నెలకు రూ.400 ఉండగా 50శాతం మేర పెంచి రూ.600గా నిర్ణయించింది. ప్రయాణించే మార్గంలో ఎన్ని టోల్గేట్లు ఉంటే టికెట్పై అన్ని పది రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల నుంచి ఎక్కువ బస్సులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటాయి. కరీంనగర్ ప్రధాన బస్స్టేషన్ నుంచి హైదరాబాద్కు 8వేల నుంచి పదివేల వరకు ప్రయాణిస్తుంటారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రేణిగుంట, దుద్దెడ టోల్ప్లాజాలు ఉండగా టికెట్పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు.
50శాతం పెరిగిన బస్పాస్ చార్జీలు
సాధారణ ప్రజలతో పాటు విద్యార్థుల బస్పాస్ ధరలను సైతం పెంచింది. తాజా పెంపుతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నెలవారీ స్టూడెంట్ బస్పాస్ చార్జీలు గతంలో రూ.400 ఉండగా దానిని రూ.600లకు, మూడు నెలల కాలానికి రూ.1200 నుంచి రూ.1800కు పెంచారు. దీంతో కరీంనగర్ రీజియన్ పరిధిలో దాదాపు 80 వేల నుంచి లక్ష మంది విద్యార్థులపై ప్రభావం పడుతోంది. టోల్ ధరలతో సంబంధం లేకుండా విద్యార్థుల బస్పాస్లకు సైతం ధరలు పెంచిన యాజమాన్యం కార్డు ముద్రణకు రూ.50 అదనంగా వసూలు చేస్తోంది.
ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరో రకంగా...
పల్లె వెలుగు బస్సుల్లో ఐదు కిలోమీటర్లకు ఒక స్టేజీ చొప్పన నిర్ణయించి చార్జీలు వసూలు చేస్తారు. ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రం మొత్తం కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. తాజాగా చేపట్టిన కిలోమీటర్ల సర్దుబాటుతో పలు మార్గాల్లో చార్జీలు పెరిగాయి. గతంలో చిల్లర సమస్య పేరుతో బస్సు చార్జీలను రౌండప్ చేయగా తాజాగా కిలో మీటర్ల సర్దుబాటు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. దీని వల్ల ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది.
కరీంనగర్ నుంచి జేబీఎస్కు
బస్సు పాతచార్జీ పెరిగిన
(రూ.ల్లో) తర్వాత(రూ.ల్లో)
రాజధాని 390 410
సూపర్లగ్జరీ(ఈవీ) 350 390
సూపర్లగ్జరీ 310 330
ఎక్స్ప్రెస్ 230 260
ఎక్స్ప్రెస్(ఈవీ) 240 270
గరుడ ప్లస్ 370 390
డీలక్స్ 260 280