గుప్తనిధులు.. లంకె బిందెలు | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధులు.. లంకె బిందెలు

Jun 26 2025 10:04 AM | Updated on Jun 26 2025 10:04 AM

గుప్త

గుప్తనిధులు.. లంకె బిందెలు

పూజల పేరిట ఘరానా మోసాలు

రూ.లక్షలు దండుకుంటున్న మోసగాళ్లు

నమ్మి మోసపోవద్దంటున్న పోలీసులు

కరీంనగర్‌క్రైం: ‘మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయి... పలానా చోట లంకె బిందెలు ఉన్నాయి. వెలికితీస్తే కోటేశ్వరులు అవుతారు. ఇందుకోసం ముందుగా ప్రత్యేక పూజలు చేయాలి. ఆ పూజా సామగ్రికి కొంత ఖర్చవుతుందని మొదటగా మభ్యపెట్టి.. తరువాత రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దొంగబాబాల ముసుగులో గ్రామాల్లో సంచరిస్తూ.. గుప్తనిధులు, లంకెబిందెలు, మంత్రాలు, తాయెత్తులు, వాస్తుదోశాలు, గ్రహపీడ పూజల పేరిట ప్రజలను నట్టేటముంచుతున్నారు. బాధితు ల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి మోసగాళ్లను కటకటాలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి.

పరిస్థితులను ఆసరా చేసుకుని..

దొంగబాబాలు, స్వామీజీలు అనారోగ్య సమస్యలు, అప్పులు, పరిస్థితి బాగా లేనివారిని లక్ష్యంగా చేసుకుని పరిచయం చేసుకుంటారు. వారి వద్దకు వెళ్లి.. ఇలా జరగడానికి కారణాలు చెబుతూ ప్రత్యేక పూజలు చేస్తే పరిస్థితుల మారి అద్భుతాలు చూస్తారంటూ ఆశ చూపుతారు. ఇటీవల కొత్తపల్లి మండల పరిధికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని, వారి ఇంటి పక్కన క్వింటాల్‌ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మించారు. పూజల పేరిట అతని నుంచి విడతల రూ.15 లక్షలకు పైగా వసూలు చేశారు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. గతంలోనూ వీరు జనగామ జిల్లాకు చెందిన ఓ మహిళను పూజల పేరుతో మోసం చేసి రూ.10లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

క్షుద్ర.. గ్రహపూజల పేరుతో

కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల పట్టణాల్లో, గ్రామాల్లో దొంగస్వాములు, బాబాలు చెప్పిన మాటలు వింటూ పూజల పేరిట ఇల్లు గుల్ల చేసుకున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంటివాస్తు, గ్రహచారం బాగోలేదని ప్రత్యేక పూజలు చేయాలంటూ అమాయకుల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. నగరంలో చాలామంది పూజల పేరిట పేరుగాంచారని, వారికి కలిస్తే రూ.లక్షల్లో సమర్పించుకోవాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. పోలీసులు ఇలాంటివారిపై నిఘా పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పూజలపేరిట మోసంచేస్తే చర్యలు

గుప్తనిధులు, మంత్రాలు, పూజల పేరితో అమాయక ప్రజలను మోసంచేస్తే నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలతో అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్వామీజీల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించాం.

– నిరంజన్‌రెడ్డి, కరీంనగర్‌ రూరల్‌ సీఐ

గుప్తనిధులు.. లంకె బిందెలు1
1/1

గుప్తనిధులు.. లంకె బిందెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement