
కేన్సర్ రాసిన మరణశాసనం
చందుర్తి(వేములవాడ): బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ మరణం తప్పదని మనోవేదనకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం తీరని విషాదం నింపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన కొలుకుల లక్ష్మి (55) కొద్ది రోజులుగా బ్లడ్ కేన్సర్తో బాధపడుతోంది. ఇటీవలే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కీమోథెరపీ చేసేందుకు కూడా శరీరం సహకరించదని వైద్యులు ఇంటికి పంపించారు. అప్పటి నుంచి లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కాగా, మంగళవారం ఓ మహిళ కేన్సర్తో మృతిచెందినట్లు తెలుసుకొని లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం వేకువజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా బయటకు వెళ్లిపోయి గ్రామశివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు దేవేంద్ర, కవిత, కుమారుడు తిరుమల్ ఉన్నారు. కొడుకు గల్ఫ్లో ఉండగా, కోడలు ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వివరించారు.
మరణం తప్పదని బావిలో దూకి మహిళ బలవన్మరణం