
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీహనుమాన్ ఆలయం ఎదుట సిరిసిల్ల – వేములవాడ ప్రధాన రహదారిలో గూడ్స్ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు ఒంటెద్దు శేఖర్(21) బుధవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. కామారెడ్డి జిల్లా బస్వాపూర్కు చెందిన శేఖర్ మూడేళ్లుగా నందికమాన్ వద్ద పెట్రోల్బంక్లో పనిచేస్తున్నాడు. అగ్రహారంలో టిఫిన్ కోసం వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో హనుమాన్ ఆలయం ఎదుట ఫ్లిప్కార్డు గూడ్స్ఆటో యూ టర్న్ చేస్తుండగా బైక్ ఢీకొట్టడంతో శేఖర్ అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని ఒకరు..
రాయికల్: రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన కన్నవేణి సంజీవ్ (42) బ్లేడ్ ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. సంజీవ్ తన ద్విచక్రవాహనంపై వస్తాపూర్కు వెళ్తుండగా గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్లో జగిత్యాల తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
780 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని హనుమాన్సాయి రైస్మిల్లులో మంగళవారం దాడులు చేసిన సివిల్ సప్లయ్, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు సుమారు 780 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యాన్ని బుధవారం మెట్పల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. బియ్యాన్ని నిల్వ చేసిన మిల్లు యజమాని కొండ లక్ష్మణ్తోపాటు 30 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్లో తరలించేందుకు సిద్ధమైన మంచాల అంజయ్యపైన సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ ఉమాపతి ఫిర్యాదు మేరకు 6ఏతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు.
అధిక డబ్బుకు ఆశపడి..
● రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆన్లైన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న ఘటనపై బుధవారం గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 4న తన సెల్ఫోన్కు టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని వచ్చిన మెస్సేజ్ను నమ్మాడు. మొదట రూ.1,000 పెట్టుబడి పెట్టగా రూ.1,200, రెండోసారి రూ.3,000 గానూ రూ.4,500 వచ్చాయి. ఈ నెల 21న మెస్సేజ్ రావడంతో దశల వారీగా రూ.1,30,880 పెట్టుబడి పెట్టాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో తనకు మెస్సేజ్ పంపిన నంబర్కు ఫోన్ చేయగా, మరో రూ.2 లక్షలు వేస్తే రూ.4 లక్షలు వస్తాయని చెప్పారు. బాధితుడికి అనుమానం వచ్చి 1930కు ఫోన్ చేసి వివరాలు తెలుపగా, సైబర్క్రైం జరిగినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి