
● రేషన్ పంపిణీకి మరో నాలుగు రోజులే సమయం ● జిల్లావ్యాప్
కరీంనగర్ అర్బన్: రేషన్ పంపిణీ గడువు పెంపు ఉన్నట్టా.. లేనట్టా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరు వరకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలుండగా ఇంకా బియ్యం రవాణా జరుగుతోంది. చాలామంది కార్డుదారులకు బియ్యం అందకపోగా పడిగాపులు అనివార్యమయ్యాయి. ఒకటో తేదీన పంపిణీ కావాల్సిన బియ్యం ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులు నానాపాట్లు పడుతున్నారు. యూనిట్కు 18 కిలోలు కావడం.. మూవ్మెంట్ సకాలంలో జరిగినా రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో మళ్లీ మళ్లీ మూవ్మెంట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ రేషన్ దుకాణాలకు బియ్యం చేర్చుతుండగా పంపిణీ గడువు తేదీ మరో నాలుగు రోజులే ఉంది. పెంపు ఉంటుందా.. ఉండదా అన్నది స్పష్టత లేదు. జిల్లాలో 2.90 లక్షల కార్డుదారులుండగా ఇప్పటివరకు 80శాతం వరకు పంపిణీ అయినట్లు సమాచారం. ఒక్కో దుకాణంలో పావు వంతుకు పైగా రేషన్ తీసుకోని కార్డుదారులున్నారని సమాచారం.
కిక్కిరిసిపోతున్న రేషన్ దుకాణాలు..
జిల్లాలో 2.90 లక్షల కార్డుదారులుండగా 8 లక్షలకు పైగా యూనిట్లున్నాయి. అత్యధికంగా కరీంనగర్ పాయింట్ నుంచి 278 దుకాణాలుండగా మిగతా దుకాణాలు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి పరిధిలో ఉన్నాయి. జిల్లామొత్తంగా 200కు పైగా రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం రాకపోవడం గమనార్హం. హుజూరాబాద్, చిగురుమామిడి, గన్నేరువరం, చొప్పదండి, రామడుగు, గంగాధర, సైదాపూర్ ప్రాంతాల్లోని అత్యధిక దుకాణాలు బియ్యం కోసం నిరీక్షిస్తున్నాయి. ఎంఎల్ఎస్ సామర్థ్యాన్ని బట్టి లారీలు లేకపోవడం మూవ్మెంట్ ఆలస్యానికి కారణం. ఒక్కోలారీలో వాటి మోడల్ను బట్టి 155 నుంచి 300 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నారు.
గడువు పెంపు ఉంటుందా?
ప్రతీనెలా ఒకటి నుంచి 15 వరకు రేషన్ పంపిణీ చేస్తుంటారు. ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండగా ఒక్కో కార్డుదారుకు సుమారు 20–30 నిమిషాలు పడుతోంది. ఈ లెక్కన రోజుకు 25 నుంచి 30 మందికి మాత్రమే పంపిణీ జరుగుతోంది. ఇక సిగ్నల్ సమస్య ఉంటే మరింత సంఖ్య తగ్గుతోంది. మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో జూలై మొదటివారం వరకు గడువు పొడిగిస్తేనే పంపిణీ పూర్తయ్యే అవకాశఽముంది. ఎలాగూ జూలై, ఆగష్టు నెలలో రేషన్ పంపిణీ ఉండదు. ఇక ఒక్కోకార్డుదారు అరక్వింటాల్ నుంచి క్వింటాల్ వరకు బియ్యం తీసుకుంటున్నారు. దీంతో సదరు బియ్యాన్ని రవాణా చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులు
బియ్యం పంపిణీ తీరిలా
ప్రతి నెలా కేటాయించే బియ్యం: 52,768 క్వింటాళ్లు
మూడు నెలలకు కేటాయించిన బియ్యం: 1,58,304 క్వింటాళ్లు
ఇప్పటివరకు పంపిణీ చేసిన బియ్యం: 1.15 లక్షల క్వింటాళ్లు (సుమారు)
జిల్లాలో గ్రామాలు: 313
మొత్తం జనాభా: 10,09,234
రేషన్ కార్డులు: 2,90,399
యూనిట్లు: 8,79,472
రేషన్ దుకాణాలు: 566

● రేషన్ పంపిణీకి మరో నాలుగు రోజులే సమయం ● జిల్లావ్యాప్