
పనితీరు మార్చుకోవాలి
● పారిశుధ్యంలో మార్పు రావాలి ● అక్రమ నిర్మాణాలు అరికట్టాలి ● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రత్యేకాధికారిగా నేను మొదట్లో చెప్పిన ఆదేశాలను ఇప్పటివరకు పట్టించుకున్నట్లు లేరు. గతంలో ఇచ్చిన టాస్క్లు ఏవీ పూర్తి చేయలేదు. పనితీరు మార్చుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు’.. అంటూ కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి అధికారులను హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాలకు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలైనట్లుగా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సెక్షన్లవారీగా పరిష్కరించాలని, ప్రజావాణిలో టౌన్ప్లానింగ్లోని అన్నిస్థాయిల అధికారులు పాల్గొనాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, కోర్టు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. పారిశుధ్యంలో మార్పులు తీసుకురావాలని, డీ సిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గార్బెజ్ పాయింట్లను, ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నగరవ్యాప్తంగా వీధిదీపాలు వెలిగేలా చూడాలన్నారు. రెవెన్యూ అధికారులు పెండింగ్లో ఉన్న 9500 ట్రేడ్ లైసెన్స్లను నెలరోజుల్లో పూర్తి చేయాలన్నారు. విలీన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ మ్యుటేషన్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ప్రకటనలపై పన్నులను వసూలు చేయాలని అన్నారు. రోడ్లపైకి నిర్మాణాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మోహియొద్దిన్, ఈఈలు సంజీవ్, యాదగిరి పాల్గొన్నారు.