
చినుకు రాలక.. మొలక రాక
చిగురుమామిడి: కార్తెలు కరుగుతున్నా.. చినుకు రాలడం లేదు. కాలం గడుస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. ముందస్తు వర్షాలతో సంబరపడ్డ రైతులను మొగులు వెక్కిరిస్తోంది. వేసిన విత్తనం భూమిలోనే మాడిపోతోంది. రైతులు విత్తనాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిగురుమామిడి మండలంలో రోహిణికార్తెకు ముందే పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. అప్పుడు కురిసిన తేలికపాటి వర్షాలకు 50శాతం వరకు విత్తనాలు మొలకెత్తాయి. కొద్దిరోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు, మొలకలు మాడిపోతున్నాయి. మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, కొండాపూర్, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, చిగురుమామిడి, ఓగులాపూర్, పీచుపల్లితో పాటు పలు గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదు. పంటను కాపాడుకునేందుకు కొన్ని గ్రామాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని గ్రామాల్లో కూలీల సహాయంతో నీరు అందిస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో స్ప్రింక్లర్ల సాయంతో నీటితడులు పెడుతున్నారు.