
కరీంనగర్లో మినీ డంప్యార్డులు
కరీంనగర్లోని వివిధ కాలనీల్లోని ఖాళీ స్థలాలు మినీ డంప్యార్డ్లను తలపిస్తున్నాయి. రోడ్లవెంట చెత్తకుప్పలు గుట్టలుగా పేరు కుపోయాయి. వీధులు, పరిసరాల్లో చెత్తాచెదారం కనిపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో జనావాసాల నడుమ మురికికూపాలు ఏర్పడుతున్నాయి. స్వచ్ఛ ఆటోలు, డంపర్బిన్లు ఉన్నప్పటికీ.. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కార్మికుల్లో పట్టింపు లేకుండా పోయింది. తమకు కేటాయించిన డివిజన్లలో పారిశుధ్య పనులు చేపట్టాల్సిన కార్మికులు, హాజరు తరువాత కనిపించకుండా పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వాళ్లకు జరిమానా విధిస్తున్నాం’. అని బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వివరించారు.