ఇక ఫేస్‌ రికగ్నేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక ఫేస్‌ రికగ్నేషన్‌

Jun 25 2025 6:48 AM | Updated on Jun 25 2025 6:48 AM

ఇక ఫేస్‌ రికగ్నేషన్‌

ఇక ఫేస్‌ రికగ్నేషన్‌

మండల పరిషత్‌ ఉద్యోగులకు అమలు

త్వరలో ప్రారంభించేందుకు చర్యలు

కరీంనగర్‌రూరల్‌: మండల, జిల్లా పరిషత్తు అధికారులకు ఇకనుంచి ముఖగుర్తింపుతోనే హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిసంస్థ డైరెక్టర్‌ రవీందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16నుంచి అన్ని మండల, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరును అమలు చేయాలని ఆదేశించారు. గతంలో ఆయా కార్యాలయాల్లో వేలిముద్ర హాజరు విధానం అమలులో ఉండగా పరికరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో మూలనపడింది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ విధానంలో ఉద్యోగులు హాజరు రిజిస్టర్‌లో పేర్లు రాస్తుండగా కొందరు విధులకు ఆలస్యంగా వచ్చినప్పటికి సమయానికి వచ్చినట్లుగా హాజరు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని 15 మండల, ఒక జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తప్పనిసరిగా ముఖగుర్తింపుతోనే హాజరు కావాల్సి ఉంటుంది.

పూర్తిస్థాయిలో సేవలు

ముఖహాజరు విధానంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలవుతాయి. పథకాల అమలులో మండలస్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. గతేడాదితో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. మండలస్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, సూపరింటెండెంట్‌, పీఆర్‌,హౌజింగ్‌బోర్డు ఏఈలు, ఈజీఎస్‌ ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులు సేవలందిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుండటంతో సమయపాలన పాటించకపోవడంతో సకాలంలో ప్రజలకు సేవలందడంలేదు. ముఖగుర్తింపు హాజరుతో ఉద్యోగులు సమయపాలన పాటించడంతో అర్హులందరు సంక్షేమ పథకాలను సకాలంలో అవకాశముంది.

ఉద్యోగుల వివరాల సేకరణ

ముఖగుర్తింపు హాజరు విధానంకోసం మండల, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ముఖగుర్తింపు పరికరంలో ఉద్యోగులు రెండుపర్యాయాలు హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఉదయం కార్యాలయానికి వచ్చినపుడు, తిరిగి సమయం ముగియగానే ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి హాజరు నమోదు చేయాల్సి ఉంది. హాజరు యంత్రానికి జీపీఎస్‌ను లింక్‌చేయడంతో ఉద్యోగుల నమోదైన రోజువారీ హాజరు నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల వివరాలను మాత్రమే సేకరిస్తున్నామని, ఇంకా హాజరు యంత్రాలు కార్యాలయాలకు రాలేదని మండల, జెడ్పీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement