వామ్మో.. విద్యుత్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. విద్యుత్‌ షాక్‌

Jun 17 2025 5:38 AM | Updated on Jun 17 2025 5:38 AM

వామ్మో.. విద్యుత్‌ షాక్‌

వామ్మో.. విద్యుత్‌ షాక్‌

కలవరపెడుతున్న కరెంట్‌ ప్రమాదాలు

అవగాహన కల్పిస్తున్నా.. ఆగని వైనం

మృత్యువాత పడుతున్న సిబ్బంది

జగిత్యాలఅగ్రికల్చర్‌: కరెంట్‌తో విద్యుత్‌ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా.. విద్యుత్‌ శాఖ క్షేత్రస్థాయిలో పని చేసే తమ సిబ్బందినే కాపాడుకోలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రాత్రిబవళ్లు కష్టపడి విద్యుత్‌ను పునరుద్ధరించే క్షేత్రస్థాయి విద్యుత్‌ సిబ్బంది లైన్లు సరి చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యుత్‌ ప్రమాదాలకు కారణం ఏదైనా.. చనిపోయేది మాత్రం క్షేత్రస్థాయిలో పని చేసే జూనియర్‌ లైన్‌మెన్లు, లైనుమెన్లు, కూలి ప్రాతిపదికన వచ్చే విద్యుత్‌ కార్మికులు మాత్రమే. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కొత్తదాంరాజ్‌పల్లి సబ్‌ స్టేషన్‌ పరిధిలో పని చేస్తున్న జూనియర్‌ లైన్‌మెన్‌ దుంపేట రాజేశం కరెంట్‌ తీగలు సరి చేస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందాడు.

5.21లక్షల విద్యుత్‌ కనెక్షన్లు

జిల్లాలో వ్యవసాయ, గృహ, పరిశ్రమలకు చెందిన దాదాపు 5.21లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటికి విద్యుత్‌ సరఫరా చేయడంలో భాగంగా ఒక 220/132 కేవీ, ఎనిమిది 132/33 కేవీ, నూట పదిహేడు 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, 22,884 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్ముర్లు, 11 కేవీకి చెందిన 520 ఫీడర్లు, 41వేల ఎల్‌టీ ఫీడర్లున్నాయి. వీటన్నింటి ద్వారా ప్రతిరోజు 3.5 నుంచి 4లక్షల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పంపిణీ జరుగుతుంది. అయితే ఈ తతంగాన్ని పర్యవేక్షించేందుకు అధికారులు ఓ మోస్తారుగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పని చేసే విద్యుత్‌ సిబ్బంది మాత్రం సరిపోవడం లేదు. కనీసం 3వేల సర్వీసులకు ఒక లైన్‌మెన్‌, 1,000 సర్వీసులకు ఒక జూనియర్‌ లైన్‌మెన్‌ ఉండాల్సి ఉండగా.. ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీనికితోడు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో ఆపరేటర్‌ పోస్టులు మంజూరు చేయకపోవడంతో.. అక్కడక్కడ లైన్‌మెన్లే ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. దీంతో సిబ్బందిపై మానసిక, పని ఒత్తిడి పెరిగి ప్రమాదాల బారిన పడుతున్నారు.

లైన్‌ క్లియరెన్సు తీసుకుంటున్నా ప్రమాదాలే..

విద్యుత్‌ లైన్లలో ఎక్కడైనా సమస్య ఎదురైతే అక్కడి సబ్‌ స్టేషన్‌ నుంచి లైన్‌ క్లియరెన్సు తీసుకుంటారు. లైన్‌ క్లియరెన్సులో సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌, ఆ ప్రాంత లైన్‌మెన్‌ కీలకం. లైన్‌ క్లియరెన్సు గురించి లైన్‌ మరమ్మతు పనులు కింది సిబ్బందికి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల విద్యుత్‌ సిబ్బంది మధ్య సమన్వయం కుదరకపోవడం, అక్కడక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు ప్రతి సబ్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగైదు స్విచ్‌ కంట్రోల్స్‌ ఏర్పాటు చేసుకుంటారు. దీనివల్ల ఏ ప్రాంతంలో మరమ్మతు చేయాల్సి ఉంటుందో ఆ ప్రాంతంలో విద్యుత్‌ను నిలిపి మిగతా ప్రాంతాలకు విద్యుత్‌ను పునరుద్ధరిస్తారు. అయితే మరమ్మతు పనులు చేసే లైన్‌మెన్‌ ఒకచోట స్విచ్‌ కంట్రోల్‌ వద్ద విద్యుత్‌ను నిలిపి మరోచోట పనులు చేస్తున్న తరుణంలో ఎవరైనా వచ్చి స్విచ్‌ను ఆన్‌ చేస్తే విద్యుత్‌ సరఫరా జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్‌ లైన్లు ప్రతిఏటా పెరుగుతున్నప్పుడు ఆ మేరకు స్విచ్‌ కంట్రోల్స్‌ కూడా ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు వెళ్లినా.. ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు.

475 ఘటనలు

జిల్లాలో కారణం ఏదైనా గడిచిన ఐదేళ్లలో 475 విద్యుత్‌ ప్రమాదాలు జరిగాయి. 2020–21లో 115 ప్రమాదాలు జరగగా.. 33 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారు. 68 పశువులు మృత్యువాత పడ్డాయి. 2021–22లో 120 జరగగా.. 29 మంది మరణించారు. 9 మంది గాయపడ్డారు. 82 పశువులు మృత్యువాత పడ్డాయి. 2022–23లో 102 జరగగా.. 32 మంది మృతిచెందారు. 11 మంది క్షతగాత్రులయ్యారు. 59 పశువులు చనిపోయాయి. 2023–24లో 81 జరగగా.. 22 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. 56 పశువులు మృత్యువాత పడ్డాయి. 2024–25లో 57 ప్రమాదాలు జరగగా.. 14 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. 41 పశువులు మృతిచెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement