
స్మార్ట్ పన్నాగం!
● టెండరు లేకుండా రూ.80 లక్షల పనుల కేటాయింపు ● పద్మనగర్ ‘గరుడ జంక్షన్’ నిర్మాణ పనుల్లో చోద్యం ● నిబంధనలకు తిలోదకాలిచ్చినా పట్టని ఉన్నతాధికారులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ప్రభుత్వాలు మారినా స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు, అక్రమాలు మాత్రం ఆగడం లేదు.అంచనాలు ఇష్టారీతిన పెంచడం, నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించడం, నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. నగరంలో కొనసాగుతున్న పద్మనగర్ జంక్షన్ పనులు మరోసారి ఈ విషయాన్ని చాటుతున్నాయి. స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని పద్మనగర్ జంక్షన్ నిర్మాణాన్ని రూ.కోటి అంచనాతో చేపట్టారు. టీటీడీ నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర దేవాలయానికి సమీపంలోని జంక్షన్ కావడంతో గరుడ జంక్షన్గా నామకరణంగా చేశారు. జంక్షన్ స్థలం ఇరుకుగా ఉండటం.. సిరిసిల్ల రూట్ నుంచి బైపాస్ మీదుగా నిత్యం భారీగ్రానైట్ లారీలు వెళ్తుండడంతో, ఈ జంక్షన్కు ఉన్న స్థలం సరిపోలేదు. దీంతో రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని (బుల్సెమెన్ స్థలం) తీసుకుని కొత్తగా గోడను నిర్మిస్తున్నారు. ఇక్కడ రిటెయిన్వాల్, రోడ్డు, లైటింగ్కు గాను అదనంగా రూ. 80 లక్షలు కేటాయించారు. సాధారణంగా ముందుగా నిర్ణయించిన అంచనాలకు పనులు పదిశాతం పెరిగితే, సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీకే అప్పగిస్తారు. అంచనాలు అంతకుమించితే.. టెండర్ తప్పనిసరి. కానీ..ఇక్కడ 80 శాతం నిధులు అవసరమైనప్పటికీ.. అధికారులకు టెండరు పిలవాలన్న ఆలోచన రాకపోవడం విశేషం.
పనుల్లోనూ గోల్మాల్
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పద్మనగర్ జంక్షన్ పనుల్లోనూ అక్రమాలు చోటుచేసుకొంటున్నట్లు సమాచారం. జరుగుతున్న పనులకు, బిల్లులకు పొంతన కుదరడం లేదు. పనులు కొనసాగుతుండగానే రన్నింగ్ బిల్లులు ఇవ్వడం సహహజమే అయినా, ఇక్కడే అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న రిటెయిన్ వాల్ నిర్మాణ పనుల్లో ఎం–15 గ్రేడ్ డిజైన్తో నిర్మాణం జరుగుతుండగా, బిల్లుల్లో మాత్రం ఎం–30 గ్రేడ్ డిజైన్తో నిర్మిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. భారీ భవంతులకు సైతం ఎం–25 గ్రేడ్ డిజైనే వాడుతారు. అలాంటిది రీటెయినింగ్ వాల్కు ఎం–30 గ్రేడ్ డిజైన్ వాడుతున్నామని నమోదు చేయడంలో ఆంతర్యం ఏంటో అధికారులకే తెలియాలి.
ఆది నుంచీ వివాదాస్పదమే...
స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన జంక్షన్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రూ.70 లక్షలతో పూర్తయ్యే తెలంగాణచౌక్ జంక్షన్ను రూ.1.30 కోటికి పెంచారంటూ అప్పట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారు. అలాగే గాంధీ జంక్షన్లోనూ అంచనాలు పెంచి బిల్లులు తీసుకోవడాన్ని ‘సాక్షి’అప్పట్లో వెలికితీయడంతో, ఆ సమయంలో ఇన్చార్జి కమిషనర్గా ఉన్న ప్రస్తుత కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ.81,450 డబ్బులు రికవరీ చేయడం సంచలనం సృష్టించింది. స్మార్ట్సిటీ పనులకు సాంకేతిక సహకారం అందించే ప్రాజెక్ట్ మేనేజింగ్ కన్సల్టెన్సీ (పీఎంసీ) పనులు పర్యవేక్షించిన ఆర్వీ కన్సల్టెన్సీ ముఖ్యప్రతినిధి సందీప్కుమార్ను సంప్రదించగా.. ఈ పనులకు తాము కేవలం సాంకేతిక సహకారం మాత్రమే అందించామని, టెండరు దాఖలు విషయాన్ని కమిషనర్ చూసుకుంటారని సమాధానమిచ్చారు. స్మార్ట్సిటీతో తమ ఒప్పందం ఇటీవల ముగిసిందని స్పష్టంచేశారు.

స్మార్ట్ పన్నాగం!

స్మార్ట్ పన్నాగం!