
లీకులతో లీడర్ల పరేషాన్
● నేడు సీడీఎంఏ వద్దకు జాబితా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్ల పునర్వి భజన తుది జాబితా బుధవారం సీడీఎంఏకు చేరనుంది. కలెక్టర్ ఆమోదం తరువాత సీడీఎంఏకు పంపించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నా రు. మార్గదర్శకాలకు అనుగుణంగా పునర్విభజన సాగుతుందా లేదా అనేది ఆరా తీసేందుకు మంగళవారం హైదరాబాద్లో సీడీఎంఏ నిర్వహించిన సమావేశానికి బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్ సహా పట్టణ ప్రణాళిక అధికారులు హాజరయ్యారు. నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పునర్విభజన తుది జాబితాను ప్రదర్శించారు.
నేడు సీడీఎంఏ వద్దకు
డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చివరి అంఖానికి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 17, 18 తేదీల్లో కలెక్టర్ పరిశీలన, ఆమోదం తరువాత 19వ తేదీన సీడీఎంఏకు జాబితాను పంపించాల్సి ఉంది. కలెక్టర్ పమేలా సత్పతి శస్త్ర చికిత్స చేసుకోవడంతో బుధవారం ఉదయం ఆమె జాబితాను పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే నిబంధనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందించగా, జాబితాలోని మార్గదర్శకాలను సీడీఎంఏకు సైతం వివరించారు. దీంతో పెద్దగా మార్పు లేకుండానే జిల్లా కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉంది. బుధవారం రాత్రి వరకు జాబితాను సీడీఎంఏకు పంపించనున్నారు.
హైదరాబాద్కు కమిషనర్
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డివిజన్ల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది పరిశీలించేందుకు సీడీఎంఏ మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పునర్విభజన చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులను రావాలని ఆదేశించింది. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, పట్టణప్రణాళిక విభాగం అధికారులు కరీంనగర్ నుంచి హాజరయ్యారు.
అంతా ఉత్కంఠ
డివిజన్ల పునర్విభజన తుది జాబితా సిద్ధం కావడంతో, మాజీకార్పొరేటర్లు, ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. తమ డివిజన్లు ఎలా ఉన్నా యో అంటూ ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన కొంతమంది అధికారులు డివిజన్ల పునర్విభజనపై లీకులు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. లీకుల సమాచారం మేరకు తాము అనుకున్న రీతిలో కాలేదని తెలిసిన కొంతమంది నాయకులు అధికారులపై ఒత్తిడి పెంచారు. తమ పార్టీ పెద్దలతో ఫోన్లు చేయించారు. దీంతో లీకులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.