
పారిశుధ్య కార్మికులకు బాసట
● సఫాయి సురక్షా అమలు ● బీమా సౌకర్యంతో పాటు వైద్యపరీక్షలు
కరీంనగర్ రూరల్: విధి నిర్వహణలో సరైన రక్షణ చర్యలు పాటించకపోవడంతో పారిశుధ్య కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో గత ఆర్నేళ్ల నుంచి కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో సఫాయి సురక్షా అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 318 గ్రామపంచాయతీలతో పాటు కరీంనగర్ కార్పొరేషన్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,692 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ కల్పించేందుకు వివరాలు సేకరించారు. ఆరోగ్య రక్షణకు హెల్త్కార్డులు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు సంబంధిత ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రతీ ఆరునెలలకోసారి ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకునే అవకాశమిచ్చారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పొందే సౌకర్యముంది. 1,332మంది కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమాయోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఒక్కో కార్మికుడికి రూ.10 లక్షల వరకు బీమా చేయించారు. కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. చేతులకు గ్లౌజ్లు, కాళ్లకు బూట్లు, తల హెల్మెట్లు అందించారు.
కార్మికుల రక్షణకు చర్యలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికుల ఆరోగ్యరక్షణ, భద్రతపై దృష్టి పెట్టాం. కార్మికుల ఆరోగ్య వివరాలు పొందు పరిచి హెల్త్కార్డులను జారీ చేయడం జరిగింది. ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యంతో కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించాం.
– కిషన్స్వామి, యూనిసెఫ్ జిల్లా కో– ఆర్డినేటర్
జిల్లాలో పారిశుధ్య కార్మికులు
318 గ్రామపంచాయతీల్లో: 1,313
కరీంనగర్ కార్పొరేషన్: 1,117
హుజురాబాద్ మున్సిపాలిటీ: 120
జమ్మికుంట మున్సిపాలిటీ: 102
చొప్పదండి మున్సిపాలిటీ: 40