
పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని ఆకునూర్లో ఓ వివాహిత పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొడిపెల్లి లక్ష్మి–కిషన్ దంపతుల కూతురు తేజస్విని(26)ని నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్కు చెందిన జెల్ల సతీశ్కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయి నాలుగేళ్లు కావస్తున్నా సంతానం కలగడం లేదని తేజస్విని మనోవేదనకు గురై ఈ నెల 13న ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. చికిత్స కోసం జమ్మికుంట ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
షార్జాలో కరీంనగర్ వాసి మృతి
కరీంనగర్క్రైం: షార్జాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న కరీంనగర్లోని కశ్మీర్గడ్డకు చెందిన ఖాజా మెహరాజ్(46) మృతిచెందాడు. 8 ఏళ్లుగా షార్జాలో ఉంటూ అల్ఖైరిన్ బాయ్స్ పాఠశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అతడి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా అతను ఉండే నివాసం తలుపుతీసి చూడగా మృతిచెంది ఉన్నాడు. కాగా గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. షార్జాలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు తెలిసింది.
దాడి ఘటనలో 9 మంది రిమాండ్
సిరిసిల్లక్రైం: భూవివాదాన్ని దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడ్డ సంఘటనలో తొమ్మిది మందిని రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన కొలగాని అంజయ్య, అతని అన్న కొడుకులు కొలగాని నాగరాజు, కొలకాని శ్రీనివాస్ మధ్య భూవివాదం ఉంది. ఈ నేపథ్యంలో అంజయ్య కుటుంబంపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కొలగాని శ్రీనివాస్, కొలగాని నాగరాజు, కొలగాని మంగవ్వ, కొలగాని మమత, కొలగాని యెల్లవ్వ, వేముల పెద్దభూమయ్య, వేముల నాగరాజు, వేముల ప్రశాంత్, వేముల అలియాస్ గుండు మల్లేశంను రిమాండ్ చేశారు.