వ్యాధులను వండి వడ్డిస్తున్నారు..
● గడువు ముగిసిన మసాలాలు.. సాస్లు ● పురుగులు పట్టిన మాంసాహారం.. కుళ్లిన కోడిగుడ్లు ● అపరిశుభ్రంగా కిచెన్ పరిసరాలు.. ● పేరుకు పెద్ద హోటళ్లు.. రోగాలకు నిలయాలు ● ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలతో వెలుగులోకి..
కరీంనగర్ అర్బన్: వీకెండ్.. బర్త్డేలు.. ఏదైనా పార్టీ సందర్భంలో హోటల్కు వెళ్తున్నారా..? నగరంలో పేరున్న రెస్టారెంట్లలో నచ్చిన ఐటమ్స్ కడుపునిండా తిందామనుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త..! కాలంచెల్లిన పదార్థాలతో కంటికి ఇంపుగా అనిపించే ఫుడ్ తయారు చేస్తుండగా.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మీ ఆరోగ్యం గల్లంతే. ఆదివారం ఫుడ్సేఫ్టీ అధికారుల టాస్క్ఫోర్స్ బృందం నగరంలోని పేరున్న మూడు హోటళ్లలో తనిఖీలు చేశారు. అపరిశుభ్రత, కాలంచెల్లిన మసాలాలు, సాస్లు వినియోగిస్తున్నారని తేలగా డీ ఫ్రిజ్, కోల్డ్ఫ్రిజ్లో వండిన పదార్థాలను నిల్వ చేసినట్లు గుర్తించి నోటీసులు జారీ చేస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ వెల్లడించారు. పేరుకే ఫేమస్ హోటళ్లు తీరు మాత్రం ‘పైన పటారం.. లోనలోటారం’ అన్నట్లుగా రుచికరమైన ఆహారం పేరిట ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల 22న ‘ఒకే ఒక్కడు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. తనిఖీలు లేకపోగా కల్తీరా యుళ్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ప్రస్తావించగా అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లలో తినే పదార్థాలు సురక్షితం కాదని, 20–25 రకాల వండిన ఆహార పదార్థాలను డి ఫ్రిజ్లో నిల్వ చేశారని గుర్తించడం ఆందోళనకర పరిణామం. శ్వేత, ప్రతిమ, హోటల్ విందు హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
పేరుకే పెద్ద హోటళ్లు..
పెద్ద రెస్టారెంట్లలోనూ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నీళ్లను ఫ్రీగా ఇవ్వాల్సిన నిర్వాహకులు బయట రేటు కన్నా రెండు మూడింతల ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. ఫుడ్సేఫ్టీ రూ ల్స్ ప్రకారం నీళ్లలోని టీడీఎస్ 75 మైక్రోగ్రాములు ఉండాలి. అంత కన్నా తక్కువ ప్రమాణాలున్న నీళ్లను జనానికి ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలున్నా యి. నూనెలను ఒకట్రెండు సార్లు వాడాక మార్చాల్సి ఉన్నా మార్చడం లేదు. పలు రెస్టారెంట్లలో కల్తీ నూనెలను వాడుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల చనిపోయిన జంతువుల కళేబరాల్లోని బొక్కల నుంచి తీసిన ఆయిల్తో నూనెల్ని కల్తీ చేస్తున్నారు. వాటి తో పేగులపై దుష్పరిణామాలు ఉంటాయి.
బయటి ఫుడ్తో రోగాలే..
కల్తీఫుడ్ తింటే దీర్ఘకాలిక సమస్యలూ వస్తాయని సీనియర్ వైద్యుడు, ఎండీ చెస్ట్ డా.సాయిని నరేందర్ వివరించారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో డయేరియా, విరేచనాలు, కడుపునొప్పి, ఎసిడిటీ వంటివి వస్తాయన్నారు. కలరింగ్ ఏజెంట్లు, క్లాస్ 2 ప్రిజర్వేటి వాడకం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదముందన్నారు. పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్ల ముప్పు ఉంటుందన్నారు.
ఫ్రిజ్లో పెట్టి.. వండి వడ్డిస్తూ..
రెస్టారెంట్లలో డీఫ్రిజ్, డీ కోల్డ్ విధానాన్ని అనుసరిస్తుండటం విచారకరం. కొన్ని హోటళ్లలో అపోలో ఫిష్, ఫ్రాన్స్, పాలక్ పన్నీరు, వండిన చికెన్, మటన్, కట్ మిర్చి, ఉడుకబెట్టిన అన్నం ఫ్రిజ్లో పెట్టినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఫంగస్ వచ్చిన మక్కలు కూడా ఉండటం విశేషం. గడువు ముగిసిన మసాలాలు, సాస్లు, వెనిగర్లు ఉండగా 25 రకాల వండిన పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ చేసినట్లు తేలడం భోజన ప్రియులకు ఎంతటి నాణ్యౖ మెన ఆహారం అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బిర్యానీతో నాసిరకం ఉల్లిగడ్డలను సర్వ్ చేస్తున్నా రు. నాన్స్, రుమాలీ రోటీ తయారీ కోసం పురుగు పట్టిన మైదాను వాడుతున్నారు. బూజు పట్టిన డ్రైఫ్రూట్స్ను బిర్యానీ, కర్రీల్లో వినియోగిస్తున్నారు. చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను సగం వండి ఫ్రిజ్లో పెట్టి.. కస్టమర్ అడిగినప్పుడు మళ్లీ వండి వడ్డిస్తున్నారు. మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ను ఫ్రిజ్లో దాచి, మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
వివరాల వెల్లడిలో ఏఎఫ్సీ దోబూచులాట
కరీంనగర్లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ బృందం వివరాల వెల్లడిలో గోప్యత పాటించడం అనుమానాలకు తావిస్తోంది. ఉదయం తనిఖీలతో హడలెత్తించి.. సాయంత్రం 6గంటల వరకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ ప్రకటించారు. 9దాటినా.. వివరాల వెల్ల డిలో గోప్యత పాటించారు. ఫోన్ చార్జింగ్ లేదని, 10నిమిషాల్లో ప్రెస్నోట్ పంపిస్తామని చెప్పి తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం.