‘‘ఇచ్చట చెత్త వేయరాదు. మీరు సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉన్నారు. వేసినచో రూ.500 జరిమానా విధించబడును.’’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ‘చెత్త’ పని మాత్రం మానడం లేదు. జిల్లా కేంద్రంలోని భవానీరోడ్డులో ఉన్న అటవీశాఖ కార్యాలయం గోడకు ఆనుకుని స్థానికులు నిత్యం చెత్త వేస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. చెత్త వేస్తే జరిమానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ అక్కడ చెత్త పారవేసే వారి తీరు మారలేదు. కంచెను ఆనుకుని చెత్త పారవేస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
– కామారెడ్డి అర్బన్
రూర్బన్ పథకం కింద జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.కోటీ 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం వినియోగంలోకి తీసుకురాకపోవడంతో తుమ్మ చెట్లు మొలుస్తున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి నిర్మించి వృథాగా వదిలేశారు. ఎందుకు నిర్మించారో, ఎందుకు వదిలేశారో అధికారులు, ప్రజాప్రతినిధులకే తెలియాలి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


