● రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● పెట్టుబడి సాయం విడుదల
రామారెడ్డి: వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డిలోని రైతు వేదికలో మంగళవారం రాత్రి నిర్వహించిన రైతుభరోసా పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడం వల్ల పారదర్శకతతోపాటు సకాలంలో పెట్టుబడి అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్లో 10,851 మంది రైతులకు రూ.9,35,33,533 కోట్లు, అలాగే 2025–26 యాసంగి సీజన్లో 10,950 మంది రైతులకు రూ.7,34,81,576 ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు.
రెండు ఎకరాలు ఉన్న వారికి రైతుల ఖాతాలో ఇప్పుడు జమ అవుతాయని, మిగతా రైతులకు 9 రోజుల్లో జమవుతాయని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రైతు భరోసా సాయం అందేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ రవితేజ, ఏవో భానుశ్రీ, తహసీల్దార్ ఉమాలత, సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


