కామారెడ్డి టౌన్ : జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా వికలాంగుల, సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశాలను మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా చూడాలన్నారు. జిల్లా వికలాంగుల కమిటీ సమావేశంలో సభ్యులు దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా సంక్షేమ అధికారిని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశంలో వృద్ధుల సంక్షేమ అంశాలపై సమీక్షించారు. ఆర్డీవో పరిధిలో పెండింగ్లో ఉన్న మెయింటెనెన్స్ కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. వృద్ధుల హక్కులను పరిరక్షిస్తూ, వారి సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న, కమిటీ సభ్యులు పున్న రాజేశ్వర్, రాజన్న, సాయిగౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


