ధర్పల్లి: పిడుగుపాటుతో ఒకరు మృతి చెందిన ఘటన ధర్పల్లి మండలం కర్నల్ తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. కర్నల్ తండాకు చెందిన ధరావత్ దేవీసింగ్ (50) ఆదివారం సాయంత్రం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పొలంలో పనిచేస్తున్న ధరావత్ దేవీసింగ్పై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా దేవీసింగ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడి భార్య రూక్కి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోసాన్పల్లి గ్రామ శివారు ముర్సు కుంటలో ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్లిన బేస్త సాయిలు(58) ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. సాయిలు కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది వెతకగా సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


