● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఆయన సోమవారం దేమికలాన్లో రెండు వరుసల రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. రూ.20 కోట్లతో దేమికలాన్ నుంచి కన్కల్, కరడ్పల్లి, జనగాం మీదుగా బాన్స్వాడ ఎక్స్రోడ్డు వరకు రెండు వరుసల రోడ్డు కానుందన్నారు. ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే ఐదు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేమికలాన్లోనే 38 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్నారని, అలాగే రూ.20 లక్షలతో జీపీ భవన నిర్మాణం, రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనం, రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు జరిగాయన్నారు. అలాగే రూ.40 లక్షలు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినట్లు తెలిపారు. గాంధారిలో మినీ స్టేడియానికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే తాడ్వాయిలో కూడా మినీ స్టేడియానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అనంతరం కన్కల్లో గల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుతో మాట్లాడారు. ఎంపీడీవో భరత్కుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సంజీవులు, నాయకులు వెంకట్రెడ్డి, షౌకత్అలీ, శివాజీ, శ్యాంరావు, రాజేశ్వర్రెడ్డి, అఖిల్రావు, కిష్టారెడ్డి, సర్పంచ్లు రవీందర్రెడ్డి, భైరవి, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి సహకరించాలి
గాంధారి(ఎల్లారెడ్డి): నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సహకరించాలని, అంకితభావంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంతో పాటు పలు గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పార్టీ కార్యాలయం ప్రారంభించారు.
నేడు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రాక
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి నేడు ఎమ్మెల్యే మదన్మోహన్రావు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులతో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.


