వట వృక్షానికి ప్రత్యేక పూజలు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని వట వృక్షాలకు సోమవారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వట పౌర్ణమి సందర్భంగా మహిళలు మర్రిచెట్టుకు పూజలు చేసి సకల సౌభాగ్యాలు కలగాలని వారు వేడుకున్నారు. అనంతరం మహిళలు నైవేద్యాలను వట వృక్షానికి సమర్పించారు.
భిక్కనూరు: జంగంపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు వట సావిత్రి వ్రతం సోమవారం ఆచరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అతి పురాతనమైన మర్రిచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేసి ఒడి బియ్యం సమర్పించుకున్నారు. సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు.
లక్ష్మీమాతకు ప్రత్యేక పూజలు
పెద్దకొడప్గల్(జుక్కల్): ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామస్తులు లక్ష్మీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం కాటేపల్లిలో కౌలాస్ శ్రీ మహంతేశ్వర మఠం పీఠాధిపతి మల్లికార్జున శివాచార్యులు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
భక్తిశ్రద్ధలతో సామూహిక నవదుర్గ వ్రతం
కామారెడ్డి అర్బన్: జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక శారదామాత ఆలయంలో సామూహిక నవదుర్గ వ్రతం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వ్రతం అనంతరం దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే దేవునిపల్లి శ్రీరమ సత్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


