● వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
● ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు తదితర ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో వరప్రసాద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థికి అభినందన
లడాఖ్లోని కై గర్ రీ పర్వతాన్ని అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్ధి విస్లావత్ బన్నీని కలెక్టర్ సంగ్వాన్ అభినందించారు. 6,100 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరానికి ఈ నెల 19న చేరుకుని జాతీయ పతాకంతోపాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ ప్లెక్సీలను శిఖరంపై ఆవిష్కరించాడు. రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన బన్నీ గతంలో కూడా కిలిమంజారో, కాంగ్ యత్సే పర్వతాలను అధిరోహించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈ ఘనతను సాధించిన బన్నీని కలెక్టర్, అధికారులు అభినందించి సన్మానించారు.


