● సూపర్వైజర్ల పాత్ర కీలకం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను సమర్ధవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. సర్లో సూపర్వైజర్ల పాత్ర కీలకమన్నారు. విధి నిర్వహణలో ప్రతి బీఎల్వో తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించాలన్నారు. కొత్తగా నియమితులైన బీఎల్వోలకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సహకారం అందించేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వీ గిరి, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బీఎల్వోలకు అవసరమైన ఎస్ఐఆర్ కిట్లను కలెక్టర్ సంగ్వాన్ తన చాంబర్లో అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలన్నారు. ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను సకాలంలో సేకరించాలన్నారు. ప్రజలకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల విభాగం అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.


