నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఆరాధ్యరెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం శిఖరమెక్కిన అభిమానం

కామారెడ్డి అర్బన్‌ : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ, డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 29న సోమవారం నిజామాబాద్‌ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్‌)లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్‌ టీ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. గతంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయి, సీటు పొందని వారు, ఇతర కళాశాలలో స్లైడింగ్‌ కోరే వారు ఈ నెల 30న వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు. సీట్ల కేటాయింపు జూలై 4న ఉంటుందని తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని మణికొండ ఆదిరా బ్యాడ్మింటన్‌ అకాడమీలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీల్లో కామారెడ్డికి చెందిన ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఆరాధ్యరెడ్డి అండర్‌–19 బాలికల డబుల్స్‌ విభాగంలో బంగారు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచి వెండి పతకం సాధించినట్లు కామారెడ్డి ఖేలో ఇండియా బ్యాడ్మింటన్‌ అకాడమీ కోచ్‌, అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే సందీప్‌ గౌడ్‌ తెలిపారు. 48వ జూనియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (సౌత్‌ జోన్‌) పోటీల్లోనూ ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తిగా ఉండాలని క్రీడాకారులు, అభిమానులు అభినందించారు.

వర్చువల్‌గా ప్రారంభించిన

జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

కామారెడ్డి టౌన్‌ : భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ వర్చువల్‌ వేదికగా ఇచ్చిన సందేశాన్ని పార్టీ శ్రేణులు, నాయకులు ఆసక్తిగా వీక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, రాష్ట్ర నాయకులు మురళీధర్‌గౌడ్‌, బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

‘మౌంట్‌ కియాగర్‌ రి’పై

సుభాష్‌రెడ్డి చిత్రపటం

6,100 మీటర్ల ఎత్తు శిఖరాన్ని

అధిరోహించిన బన్ని

కామారెడ్డి అర్బన్‌ : పర్వతారోహణకు వెన్నుతట్టి ప్రోత్సహించిన వ్యక్తిపై అభిమానాన్ని చాటుకున్నాడు జిల్లాకు చెందిన యువకుడు. లడఖ్‌లో ప్రాంతంలోని ప్రసిద్ధ కియాగర్‌ రి శిఖరంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి చిత్రపటాన్ని ఆదివారం ప్రదర్శించారు. రాజంపేట మండలం ఎల్లాపూర్‌ తండా గుండారానికి చెందిన విస్లావత్‌ బన్ని 6100 మీటర్ల ఎత్తున్న కియాగర్‌ రి శిఖరాన్ని అధిరోహించారు. మైనస్‌ డిగ్రీల చలిని, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ శిఖరాన్ని ఎక్కారు. అయితే, బన్నీకి వెన్నుదన్నుగా నిలిచిన సుభాష్‌రెడ్డి చిత్రపటాన్ని అంత ఎత్తుపై ప్రదర్శించి ఆయనపై ప్రేమను చూపించారు. పేద విద్యార్థులకు ఆయన సహకారం అందిస్తుండటంతో మరెంతో మంది విజయాలు సాధిస్తారని బన్ని పేర్కొన్నారు. బన్ని ఇది వరకు కిలిమంజారో, మౌంట్‌ కాంగ్‌ యాట్సే అధిరోహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement