కోర్సులు ప్రవేశపెట్టాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాగా అవతరించిన తర్వాత విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తామని ఆశించిన కామారెడ్డి ప్రజలకు.. ఉన్నత విద్య విషయంలో మాత్రం నిరాశే ఎదురవుతోంది. ప్రధానంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో స్థిరపడాలనే జిల్లా విద్యార్థుల ఆశలు అసంపూర్తిగానే మిగులుతున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అవకాశాలు అపారం..
ఎంబీఏ, ఎంసీఏ పూర్తిచేసిన వారికి దేశ, విదేశాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన విద్యా వసతులు లేక కామారెడ్డి యువత ఈ సువర్ణ అవకాశాలను చేజార్చుకుంటోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రతి సంవత్సరం జిల్లాకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్, ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ హాస్టల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డిలోనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలి.
– వినయ్కుమార్, విద్యార్థి సేనా,
జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
కామారెడ్డి ప్రభుత్వ కాలేజీలో లేని
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు
హైదరాబాద్, నిజామాబాద్
బాటపడుతున్న విద్యార్థులు
పేద, మధ్యతరగతి కుటుంబాలపై
తప్పని ఆర్థిక భారం
ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని
విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి


