● నిజామాబాద్ జిల్లాలోని
పలు ప్రాంతాల్లో భారీ వర్షం
● ఎడపల్లిలో 72.8 మి.మీ.
వర్షపాతం నమోదు
నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షం కురిసింది. సీజన్ ప్రారంభమైన తరువాత ఇదే భారీ వర్షం. రైతులు ఆందోళన చెందుతున్న వేళ కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని బోధన్, నిజామాబాద్ డివిజన్లలో సుమారు రెండుగంటలపాటు భారీ వర్షం కురిసింది. ఎడపల్లిలో అత్యధికంగా 72.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మోస్రాలో 70, నవీపేటలో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఏదిఏమైనా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కురిసిన భారీ వాన రైతుల్లో ఆనందాన్ని నింపింది.


