మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లిలోగల ఇందూరు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం, అభిషేకం, అలంకరణ పూర్తి కాగానే జ్యేష్ఠ మాసంలో నిర్వహించే వరుణ యాగం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎద్దులు, నాగళ్లు, అన్ని వ్యవసాయ ఉపకరణాలను గౌరవించుకుని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతినెల పౌర్ణమి రోజు గర్భిణులకు అందించే దివ్యౌషధాన్ని సాయంత్రం 6 నుంచి 8.30 గంటలలోపు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, గర్భిణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సింహారెడ్డి కోరారు.
కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లికి బెస్ట్ యాక్టివిటీస్ అవా ర్డు దక్కింది. క్లబ్ స్థాపించిన ఏడాదిలోనే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు బె స్ట్ యాక్టివిటీస్ అవార్డుతో పాటు బెస్ట్ సెక్రెటరీ అవార్డును సొంతం చేసుకున్నట్లు క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ దిల్ సే కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ చేతుల మీదుగా బెస్ట్ యాక్టివిటీస్ అవార్డుతో పాటు, బెస్ట్ సెక్రటరీ అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమంలో లుక గంగాధర్, తెడ్డు రమేష్, చింత ప్రదీప్, రేవతి గంగాధర్, లక్మ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వే సందర్భంగా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నియోజక వర్గ నాయకులతో కలిసి ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. పార్టీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా ప్రత్యేకశ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర వహించాలన్నారు. పార్టీ సభ్యత్వ నమో దు ప్రక్రియ పై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలో నియోజక వర్గాల వారీగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ గిర్ధావర్ గంగాఽరెడ్డి, నాయకులు రవీంద్రయాదవ్, సంజీవ్, గోగినేని నర్సయ్య, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో విద్యార్థులు, యువత భవిష్యత్ ఆందోళనకర స్థితిలో ఉందని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలోని కాకతీయ కళాశాలలో ‘ఛాత్రోన్ కి గూంజ్’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలోని విద్యార్థులు, నిరుద్యోగులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు. పేపర్ లీకేజీలతో విద్యార్థులను మోసం చేయడం, నిరుద్యోగులను మోసం చేయడాన్ని తీ వ్రంగా వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారన్నారు. ‘ఛాత్రోన్ కి గూంజ్’ రాజకీయ కార్యక్రమం కాదని, దేశ యువత భవిష్యత్ కోసం ప్రారంభమైన జాతీ య ఉద్యమని స్పష్టం చేశారు. విద్యార్థి, యువ త కలలను సాకారం చేస్తేనే భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని విశ్వసిస్తున్న కాంగ్రెస్.. దేశ యువతకు విద్య, ఉపాధి, సమాన అవకాశాలు అందించేందుకు నిత్యం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్, సీనియర్ నాయకులు జావెద్ అక్రమ్, ప్రీతం, ముస్తఫా, గోవర్ధన్, వహీద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే బా ధ్యత తమదేనని త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ పేర్కొన్నా రు. ఆదివారం ఆయన పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనాలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, భీమ్గల్కు కోర్టును తీసుకొచ్చి న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. వంద పడకల ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జనవాసాలకు దూరంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ వసతి గృహానికి మారుస్తామన్నారు. నాయకులు లక్ష్మణ్, పర్స అనంతరావు తదితరులు ఉన్నారు.


