బీఈడీ విద్యార్థుల ఆందోళన
ఒకటి రాస్తే.. మరోటి..
తెయూ(డిచ్పల్లి) : జాతీయ స్థాయిలో అత్యంత ప్ర తిష్ఠాత్మకంగా నిర్వహించే యూజీసీ నెట్ (UGC& NET) పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతుండగా, అదే రోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ నాలుగో సెమిస్టర్ థియరీ పరీక్షలను ప్రారంభించనుండడం, రెండు పరీక్షలు ఒకే రోజు, ఒ కే సమయానికి ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నెట్ పరీక్షకు నెలల తరబడి సిద్ధమవుతున్న విద్యార్థుల్లో చాలామంది బీఈడీ కూడా చదువుతున్నారు. ఇప్పుడు ఒకే రోజు రెండు పరీక్షలు రావడంతో ఏది రాయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నెట్ రాస్తే బీఈడీ పరీక్ష కోల్పోవాల్సి వస్తుంది. బీఈడీ రాస్తే జాతీయ స్థాయి అర్హత పరీక్షను వదులుకోవాల్సి ఉంటుంది.
రెండు కీలకమే..
బీఈడీ పరీక్ష రాయకపోతే.. కోర్సు పూర్తి, ఫలితాలు ఆలస్యమయ్యే ప్రమాదం నెలకొంది. మరో ఏడాది నిరీక్షించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నా రు. నెట్ పరీక్ష రాయకపోతే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోల్పోయే అవకాశం ఉంది. జేఆర్ఎఫ్ అవకా శం కోల్పోవడం.. మరో నోటిఫికేషన్ వరకు నిరీక్షణ తప్పదు. నెలల తరబడి చేసిన శ్రమ వృథా అవు తుంది. రెండు పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీల కమైనవి కావడంతో అయోమయం నెలకొంది. బీఈడీ నాలుగో సెమిస్టర్ థియరీ పరీక్షలను కనీసం కొన్ని రోజులు వాయిదా వేయాలని, నెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యామ్నాయ తేదీ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.
నెట్ పరీక్ష దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, జూనియర్ రీసెర్చ్ఫెలోషిప్ (JRF) సాధించేందుకు నిర్వహించే కీలక పరీక్ష. అలాగే పీహెచ్డీ చేసేందుకు నెట్ అవసరం. మరోవైపు బీఈడీ కోర్సు పూర్తి చేయాలంటే నాలుగో సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఒక పరీక్ష మిస్ అయితే వెంటనే సప్లిమెంటరీ అవకాశం లేకపోవడంతో మరో ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో విద్యార్థులు రెండు వైపులా నష్టపోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ విడుదలైన తర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ అధికారులను కలిసి తేదీలను మార్చాలని కోరారు.


