ఎల్లారెడ్డిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి గల్లంతైన సంఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పోసాన్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. పోసాన్పల్లి గ్రామానికి చెందిన బేస్త సాయిలు(58) ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడంతో సాయి లు కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని ముర్సుకుంట వద్ద గాలించారు. కుంట ఒడ్డున సాయిలుకు చెందిన బట్టలు, చెప్పులు కనిపించాయి. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది ఎంత వెతికినప్పటికి సాయిలు ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపి వేశారు. సాయిలు గల్లంతు కావడంతో సాయిలు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


