● తమతోనే మార్పు మొదలవ్వాలని..
● ఆదర్శంగా నిలుస్తున్న ప్రథమపౌరులు
● పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో
చేర్పించాలని ప్రచారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లె ప్రథమ పౌరులు కొందరు సర్కారు చదువు విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ద్వారా గ్రామంలో మిగతా వారి పిల్లలను కూడా చేర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల సర్పంచ్లుగా బాధ్యతలు చేపట్టిన పలువురు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. పెద్దకొడప్గల్ మండలం బాబుల్గావ్ గ్రామ సర్పంచ్ రవి గ్రామం నుంచి ప్రైవేటు బడులకు వెళ్లే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే రూ.5 వేలు నజరానా ఇస్తానని ప్రకటించారు. సదాశివనగర్ మండలం మర్కల్ సర్పంచ్ ప్రియాంక తన సొంత డబ్బులతో పాఠశాలకు రంగులు వేయించారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట సర్పంచ్ వినోద ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల కుటుంబాలకు ఇంటి పన్ను మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ ఉపసర్పంచ్ రాజుయాదవ్తోపాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు సహకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి పలువురు సర్పంచ్లు చొరవ చూపుతున్నారు. అలాంటి చోట్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.


