● హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలి
● ప్రత్యేక అధికారిణి విజయేంద్ర
కామారెడ్డి క్రైం: అధికారులు సమష్టిగా కృషి చేసి జిల్లాలో అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందంజలో నిలపాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కమిషనర్, ప్రత్యేక అధికారిణి విజయేంద్ర సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో జిల్లా పనితీరు అభినందనీయమన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై 10 శాఖలకు సంబంధించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా విజయేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. 99 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన చర్యలు ప్రశంసనీయమన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, డీఎఫ్వో నీరజ్, డీఆర్వో పాండు, ఆర్డీవోలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


