● నాబార్డు డీడీఎం ప్రవీణ్కుమార్
సుభాష్నగర్ : సహకార సంఘాలు నాబార్డు ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు పొంది 2 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టవచ్చని డీడీఎం ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం, తృణధాన్యాల నిల్వలకు సంబంధించి గోదాముల నిర్మాణం అనే అంశంపై సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఎం మాట్లాడుతూ సొసైటీల ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి అతి తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా, అకాల వర్షాలు, ఇతర కారణాలతో పంటలు పాడై పోకుండా నివారించేందుకు, గ్రామస్థాయిలో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. దీంతో రైతులు తమ పంటను అత్యవసరంగా కాకుండా మార్కెట్లో డిమాండ్ మేరకు విక్రయించుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు. సొసైటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో నాగభూషణం వందే, నిజామాబాద్, కామారెడ్డి డీసీవోలు శ్రీనివాస్రావు, రామ్మోహన్రావు, ఎఫ్సీఐ ప్రతినిధులు, బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, అనుపమ, సుమమాల, సొసైటీ చైర్మన్లు, సీఈవోలు పాల్గొన్నారు.


