● రైతులు ఆందోళన చెందొద్దు
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలో గురువారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, రైతుల అవసరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ఏడాది నియోజకవర్గానికి 1.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగా, ఈ ఏడాది జూన్ 20 నాటికే రికార్డు స్థాయిలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని వెల్లడించారు. అదనంగా రేపు మేడ్చల్ నుంచి మరో 3,500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అందుబాటులోకి రానుందన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


