నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఉన్నతాధికారుల అనుమతితోనే నాగిరెడ్డిపేట గ్రామంలో జగ్గనిచెరువుకట్టపై ఛత్రపతిశివాజీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు. చెరువుకట్ట చివరన శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం భూమిపూజ చేసేందుకు గురువారం ఆయన గ్రామానికి చేరుకున్నారు. కాగా విగ్రహం ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారుల నుంచి అభ్యంతరం వచ్చిన నేపథ్యంలో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పైడి ఎల్లారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసుల అనుమతితో విగ్రహ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం అనుమతులు పొంది ప్రస్తుతం నిర్ణయించిన స్థలంలోనే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బెజుగంచెరువుతండా సర్పంచ్ భాస్కర్, నాయకులు గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగ్గనిచెరువు కట్టపై శివాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతులివ్వాలని కోరుతూ గ్రామ యువకులు ఇరిగేషన్ ఏఈ అక్షయ్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు.


