● ప్రాణాపాయస్థితిలో ఉన్న శిశువును ఆస్పత్రికి తరలింపు
కామారెడ్డి టౌన్ : నెలలు నిండకుండానే పుట్టి, శ్వాసకోశ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకు ప్రభుత్వ చిన్నపిల్లల అంబులెన్స్ సిబ్బంది పునర్జన్మను ప్రసాదించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం మంతన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన వడ్డే రమ్యకు రెండో కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించగా మగ శిశువు జన్మించాడు. నెలలు నిండకుండానే పుట్టడం, ఉమ్మ నీరు సమస్య ఎక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే బాబు ఏడవకుండా, తీవ్ర శ్వాస ఇబ్బందితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పిల్లల వైద్యులు ప్రాథమిక అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ చిన్నపిల్లల ప్రత్యేక అంబులెన్స్ ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్ రాజేందర్ తక్షణమే శిశువును తీసుకెళ్లారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిశువును ప్రత్యేక ఇంక్యుబేటర్లో ఉంచి, నిరంతరం ఆక్సిజన్ అందించారు. అత్యంత వేగంగా, సురక్షితంగా శిశువును నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ బాబు ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బందికి శిశువు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


