● ప్రభుత్వ సలహాదారు
పోచారం శ్రీనివాస్రెడ్డి
● బాన్సువాడలో ఆర్డీవో క్యాంపు
కార్యాలయం ప్రారంభం
బాన్సువాడ : ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలందించాలనే లక్ష్యంతో ఆర్డీవో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడలో ఎస్డీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో ఆర్డీవో/సబ్ కలెక్టర్ నివాసం, క్యాంపు కార్యాలయం నిర్మించారు. దీనిని శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో కలిసి పోచారం ప్రారంభించారు. అంతకుముందు బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి దంపతులు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి, డీఎస్పీ విఠల్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి సందర్శన..
బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ తదితరులున్నారు.


