భూరికార్డుల ప్రక్షాళనతో తిప్పలు..
భూమి ఉన్నా..
గతంలో ఇచ్చిన పట్టాదారు పాస్పుస్తకాలను చూపుతున్న రైతులు
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో వివిధ సర్వే నంబర్ల కింద 170 ఎకరాల భూమి ఉంది. దానిని 77 కుటుంబాలు మూడునాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్నాయి. ఆ భూములకు హక్కులు కల్పించాలంటూ దశాబ్దాల తరబడిగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. 1998 లో అప్పటి కామారెడ్డి ఆర్డీవో శ్రీదేవి ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఆ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, యాజమాన్య హక్కు పుస్తకాలు (టైటిల్ డీడ్)లు అందించారు.
అయితే ఆ భూమి దేవాలయానికి సంబంధించినదంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ కేసు ఎటూ తేలడం లేదు.
మాకు అప్పట్లో ఇచ్చిన పాసుపుస్తకాలతోనే ఇరవై ఏళ్లు అన్ని పనులు చేసుకున్నం. ఏ ఇబ్బందీ లేకుండే. ధరణిలో మాకు కొత్త పాస్పుస్తకాలు రాకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. మా సమస్య పరిష్కరించి పాసుపుస్తకాలు ఇచ్చి ఆదుకోవాలి.
– వేముల బాలమణి, రైతు
తాతల కాలం నుంచి పంటలు పండించుకుని బతుకుతున్నం. అప్పట్ల మాకు పాసుపుస్తకాలు ఇచ్చిండ్రు. వాటితోని లోన్లు వచ్చినై. కొందరికి రుణమాఫీ కూడా అయ్యింది. ఇప్పుడు కొత్త పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నం. మమ్మల్ని ఆదుకోవాలి.
– వేముల బాలయ్య, రైతు
అగ్రహారం రైతులకు 1998 సంవత్సరంలో జారీ అయిన పాస్బుక్కులతో సుమారు రెండు దశాబ్దాల పాటు సంక్షేమ పథకాలు పొందారు. పంట రుణాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక రుణాలు, సబ్సిడీలు పొందారు. రుణమాఫీ కూడా అయ్యింది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారులు వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలోని భూములకు సంబంధించిన సర్వే నంబర్లను పార్ట్ బీలో చేర్చారు. రికార్డుల్లో దేవాదాయ భూములుగా పేర్కొన్నారు. దీంతో వెంకటాపూర్ అగ్రహారం రైతుల భూముల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. డిజిటల్ పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలకు దూరమవ్వాల్సి వచ్చింది. పాస్బుక్కులు లేకపోవడంతో పంట రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లలో పది మంది చనిపోయారని, డిజిటల్ పాసుపుస్తకాలు వచ్చి ఉంటే వారికి రైతు బీమా వర్తించేదని పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోలు, పంట ఉత్పత్తుల అమ్మకాలకూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ భూములతో వారికి మూడు తరాల అనుబంధం ఉంది. తాతలు, తండ్రులు సాగు చేసుకుని బతికారు. ఇప్పుడు మూడో తరం అయిన మనవళ్లు అదే భూమిని నమ్ముకుని జీవిస్తున్నారు. అయితే ‘ధరణి’ వారి హక్కులను దూరం చేసింది. కొత్త పాస్బుక్కులు జారీ కాకపోవడంతో
సంక్షేమ పథకాలకు దూరమై ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
దశాబ్దాలుగా భూములు సాగు
చేసుకుంటున్న అగ్రహారం రైతులు
1998లో పాస్బుక్కులు జారీ
‘ధరణి’ రాకతో మారిన పరిస్థితి..
పార్ట్–బీలో చేర్చిన అధికారులు
సంక్షేమ పథకాలకు
దూరమైన అన్నదాతలు
కొత్త పాస్బుక్కులు ఇవ్వాలని వినతి


