● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే
● మద్నూర్లో రైతు మహాధర్నా
మద్నూర్(జుక్కల్): రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింధే విమర్శించారు. వరి ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంట కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సింధే పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ కాలం సమీపిస్తున్నా రైతులు ఇంకా పంటలను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు, ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి మోసం చేసిందని దుయ్యబట్టారు. హంగూ ఆర్భాటాలకే స్థానిక ఎమ్మెల్యే పరిమితమయ్యారని విమర్శించారు. తన హయాంలోనే ఆరు మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఏ మండలంలో కూడా సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. అనంతరం తహసీల్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రం అందించారు. ఆందోళనలో పార్టీ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, నాయకులు కృష్ణపటేల్, విజయ్, హన్మాండ్లు, రాజేశ్వర్గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.


