వర్షకాలం నాటికి సిద్ధం చేస్తాం
● రూ. 24 లక్షలు మంజూరు
● నేడు నీటి విడుదల
కౌలాస్ నాలా ప్రాజెక్టు
నిజాంసాగర్: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు వరద గేట్లకు మరమ్మతులు, గ్రీజింగ్, ఆయిలింగ్, రూప్ వైర్ల ఏర్పాటుకోసం ప్రభుత్వం రూ. 24 లక్షల నిధులు మంజూరు చేసింది. నిధులు రావడంతో మరమ్మతు పనులపై నీటిపారుదలశాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని వరద గేట్ల ద్వారా దిగువనకు విడుదల చేయాలని నిర్ణయించారు. గురువారం నీటి విడుదలను ప్రారంభించనున్నారు. వరద గేట్ల ద్వారా 100 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంజీర నది తీరం వైపు రైతులు, పశువుల కాపరులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 9 వరద గేట్లు ఉన్నాయి. గతేడాది వర్షాలు విస్తారంగా కురవడంలో భారీ వరదలు వచ్చాయి. వరద గేట్ల ద్వారా లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదిలారు. ఈ క్రమంలో ప్రాజెక్టు రెండు గేట్లకు సంబంధించిన రూప్ వైర్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు వరద గేట్ల నిర్వహణ, రూప్వైర్ల ఏర్పాటు, గ్రీజింగ్, ఆయిలింగ్ కోసం నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. రూ. 24 లక్షలు మంజూరయ్యాయి.
కౌలాస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 454.55 మీటర్లు (0.557 టీఎంసీ) నీరు నిల్వ ఉంది. మరమ్మతులకు ఆటంకం కలగకుండా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
కౌలాస్ ప్రాజెక్టు గేట్లకు గ్రీజింగ్, ఆయిలింగ్, రూప్ వైరింగ్ ఏర్పాటు కు నిధులు వచ్చాయి. ప్రాజెక్టు నీటిని ఖాళీ చే సి వరద గేట్లకు మరమ్మతులు చేపడతాం. నీటిని విడుదల చేయను న్న నేపథ్యంలో మంజీర నదీ తీరం వైపు ఎవ రూ వెళ్లవద్దు. వర్షకాలం ఆరంభం నాటికి మరమ్మతులు పూర్తిచేసి, వరద గేట్లను సిద్ధం చేస్తాం.
– సోలోమాన్, ఈఈ,
నిజాంసాగర్ నీటిపారుదలశాఖ


