● చెక్పోస్ట్ల వద్ద 24 గంటల తనిఖీలు
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బక్రీద్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూచనలు, సలహా లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను వివరించారు. అంతర్జిల్లా సరిహద్దుల్లో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చూసేందుకు జిల్లా అంతటా మత పెద్దలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, వెటర్నరీ, పోలీసు అధికారుల తో కలిసి ఎస్పీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రార్థన స్థలాలు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, వెటర్నరీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


