
అక్రమ రవాణాకు వారధి?
బాన్సువాడ: ప్రజల సౌకర్యార్థం, రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిర్మించిన బ్రిడ్జిలు అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయి. బాన్సువాడ డివిజన్లోని మూడు మండలాలైన బీర్కూర్, డోంగ్లీ, బిచ్కుందలకు అనుసంధానంగా మంజీర నదిపై నిర్మించిన బీర్కూర్ బ్రిడ్జి అక్రమ రవాణాకు రాచమార్గమైంది. ఈ బ్రిడ్జి వద్ద నిఘా లేకపోవడంతో అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బ్రిడ్జికి ఇవతల పక్కన బీర్కూర్ మండల కేంద్రం ఉంటే అవతల ఓ పక్కన బిచ్కుంద మండలం, మరొక పక్క డోంగ్లీ ఉంటుంది. ఈ బీర్కూర్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల పరిధిలో మంజీర పరివాక ప్రాంతం ఉంటుంది. ప్రధానంగా ఆయా మండలాల పరిధిలో అక్రమ ఇసుక తరలింపు జోరుగా కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. నిత్యం రాత్రి వేళల్లో టిప్పర్లు, బోలెరో, ట్రాక్టర్ల ద్వారా ఈ అక్రమ ఇసుక దందాకు అక్రమార్కులు తెరలేపారు. మంజీర నది నుంచి అక్రమంగా తరలించే ఇసుకను బ్రిడ్జి మీదుగా ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ఆయా పట్టణాలు, మండల కేంద్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్రిడ్జి అవతల వైపు నుంచి బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొపడప్గల్, జుక్కల్ మండలాలకే కాకుండా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఇక్కడి ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రిడ్జికి మరో పక్క ఉన్న కుర్లా మంజీర ప్రాంతం నుంచి అక్రమార్కులు డోంగ్లీ, మద్నూర్ మండలాలతో పాటు మహారాష్ట్రకు సైతం తలిస్తున్నట్లు తెలిసింది.
మంజీర ప్రాంతంలో పేకాట స్థావరాలు..
బీర్కూర్ సమీపంలోని మంజీర నదిపై నిర్మించిన బ్రిడ్జి సమీపంలో కొందరు పేకాట స్థావరాలను ఏర్పాటు చేశారు. బీర్కూర్కు చెందిన ఓ పేకాట ముఠా నిత్యం బైక్లపై బ్రిడ్జి కింద నది ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. ఈ తతంగం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పలు మార్లు పోలీసులు దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన ఘటనలున్నాయి. వారం రోజుల క్రితం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి నగదు, బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లు మాత్రం నెలకొక స్థావరాన్ని మారుస్తూ మూడు ముక్కలు ఆరు అడ్డాలుగా పేకాటను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు బీర్కూర్ పోలీస్ స్టేషన్ ముందు మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేస్తూ పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. బైక్లపై వచ్చి వెళ్లే వారు హెల్మెట్ పెట్టుకున్నాడా..గతంలో బైక్లకు సంబందించిన చలాన్లు పెండింగ్లో ఉన్నాయా అనే విషయాలు చూస్తున్నారు కానీ బైక్లపై నిత్యం రాకపోకలు సాగిస్తున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు..ఎందుకు వెళ్తున్నారనేది గమనించకపోవడం గమనర్హం.
మూడు మండలాలకు అనుసంధానంగా
ఉన్న బ్రిడ్జి వద్ద నిఘా కరువు
ఇసుక అక్రమ రవాణా,
పేకాట స్థావరాలకు రాచమార్గం
పోలీసుల నామమాత్రపు దాడులతోనే సరి