
తనువు చాలించి.. నలుగురికి ప్రాణదాతగా నిలిచి
కామారెడ్డి టౌన్: ఓ యువతి చనిపోయిన తర్వాత మరో నలుగురి ప్రాణదాతగా నిలించింది. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో పిట్ల విజయ్–కళ్యాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె పిట్ల సోహిత(17) ఇటీవల ఇంటర్లో 991మార్కులు సాధించడంతో పాటు జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించింది. జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం ఎస్సెస్సీ విద్యార్థులు గెట్ టు గేదర్ నిర్వహించగా ఆమె పాల్గొనగా, మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రిఫర్ చేశారు. బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో వారం రోజులు పాటు ఐసీయూలో చికిత్స పొందుతూ గురువారం తనవుచాలించింది. కుటుంబ సభ్యుల అనుమతితో యువతి అవయవాలను దానం చేశారు. తండ్రి కామారెడ్డి మున్సిపల్ వాటర్వర్క్స్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా తల్లి గృహిణి. యువతి అంతక్రియలు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరుగగా మున్సిపల్ కార్మికులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మృతిచెందిన యువతి అవయవాలు దానం చేసిన కుటుంబసభ్యులు