
ఆర్టీసీ ప్రహరీ పనులు ఆపాలని నిరసన
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ అధికారులు ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లడానికి ప్రధాన దారి ఒక్కటే ఉంది. దానికి అడ్డంగా ప్రహరీ నిర్మాణం చేపట్టవద్దని శుక్రవారం స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కనీసం 25 ఫీట్లు దారి వదిలి గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. దారి మూసివేస్తే చిరువ్యాపారులు నష్టపోయి ఉపాధి కోల్పోతారని అన్నారు. ఆర్టీసీ అధికారులు దారి వదిలకుంటే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. స్థానికులు నూకల రాజు, చిరు వ్యాపారులు, దుకాణదారులు ఉన్నారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటకు చెందిన ఆల్ఫా అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోరెడ్డి మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 10 రోజుల క్రితం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక రోడ్డుపై ఆడుకుంటుండగా అల్ఫా అనే యువకుడు సదరు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, బాలికను సఖీ కేంద్రానికి తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.