
కొందరికే కిసాన్ సమ్మాన్ నిధి
ఎల్లారెడ్డి : రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తక్కువ మంది రైతులకే వర్తిస్తోంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. 2019 జనవరి 31 కంటే ముందు భూముల పట్టాలు కలిగిన అర్హులైన రైతులు ఈ పథకం పొందేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద నమోదైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు 19 విడతల్లో పెట్టుబడి సాయం అందింది. 2019 జనవరి 31 తర్వాత పట్టాలు పొందిన రైతులలో చాలా మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం లేదు.
తగ్గుతున్న లబ్ధిదారులు
కేంద్రం నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండడంతో కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పథకం ప్రారంభించిన కొత్తలో జిల్లాలో 1,67,970 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం వీరి సంఖ్య 96,725కు తగ్గింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, నకిలీ పత్రాలతో పట్టాలు పొందిన వారు, గిఫ్ట్ డీడ్ కింద పట్టాలు పొందిన వారసులను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. అందరికీ కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధి చేకూరేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
కొత్తవారికి మంజూరు లేదు..
2019 జనవరి 31 తర్వాత భూములు కొనుగోలు చేసినవారికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు. వారసత్వంగా భూమి వచ్చినవారికి మాత్రమే వస్తోంది. కొత్తవారికి అమలు కావడం లేదు.
– అనిల్ కుమార్, ఇన్చార్జి ఏడీఏ, ఎల్లారెడ్డి
పీఎం కిసాన్ వస్తలేదు..
2019 ఫిబ్రవరిలో పట్టా చేసుకున్నా. నాకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రావడం లేదు. అధికారులను ఎన్నిమార్లు అడిగినా వస్తాయని చెబుతున్నారు తప్ప డబ్బులు మాత్రం ఖాతాలో జమకావడం లేదు.
– విఠల్, రైతు, ఎల్లారెడ్డి
కొత్తవారికి అందని పథకం
కఠిన నిబంధనలతో వేలాది మంది లబ్ధికి దూరం