కపిలేశ్వరపురం: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా యవనికపై గోదారమ్మ బిడ్డలు విజయకేతనం ఎగురవేస్తున్నారు. తద్వారా ఈ గడ్డ కీర్తిప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దేశవిదేశాల్లో జరుగుతున్న వివిధ క్రీడా పోటీల్లో విజయ పరంపర కొనసాగిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంటున్నారు. అంతేకాదు.. తమ ప్రతిభాసంపత్తితో వివిధ క్రీడా సంఘాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా.. కీలక పోటీలకు న్యాయనిర్ణేతలుగా కూడా వ్యవహరిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడా పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఒలింపిక్స్ హాకీలో భారత్కు మూడు బంగారు పతకాలు సాధించిన విఖ్యాత క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతి– ఆగస్టు 29ని ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారుల ప్రతిభను గుర్తు చేసుకుందాం పదండి..
అంతర్జాతీయ కీర్తికిరీటం
అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తన సహచర క్రీడాకారుడు చిరాగ్ శెట్టితో కలిసి అంతర్జాతీయ స్థాయి పురుషుల డబుల్స్లో అనేక విజయాలు సాధించాడు. ఈ ఏడాది మే 31న సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ విజేతలుగా నిలిచారు. డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్–1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. 2022 కామన్వెల్త్, 2023 ఆసియా క్రీడలు, 2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లలో సాత్విక్ స్వర్ణ పతకాలు సాధించాడు. థామస్ కప్–2022 విజేత జట్టులో సభ్యుడు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలను అందుకున్నాడు. అంతే కాదు.. అత్యంత వేగంగా బ్యాడ్మింటన్ స్మాష్ (గంటకు 565 కిలోమీటర్లు) కొట్టిన రికార్డు సాత్విక్ పేరిట ఉండటం విశేషం.
ఫ సామర్లకోటకు చెందిన ప్రముఖ మారథాన్ స్విమ్మర్ గోలి శ్యామల బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ తీరం వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని ఈది సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె గతంలో పాక్ స్ట్రెయిట్ను కూడా ఈదారు.
వైకల్యం ఓడింది
ఉమ్మడి జిల్లాలో దివ్యాంగ క్రీడాకారులు వీల్చైర్ క్రికెట్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ ఒడిశాలో జరిగిన పోటీల్లో ఏపీ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఆ జట్టులో 8 మంది క్రీడాకారులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే కావడం మరో విశేషం.
సత్తా చాటుతున్న అతివలు
వివిధ క్రీడల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన అతివలు సత్తా చాటుతున్నారు.
ఫ గత జూన్ 30న హైదరాబాద్లో జరిగిన 26వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో కాకినాడకు చెందిన తల్లీకూతుళ్లు కల్పన, తన్మయిలు పతకాలు సాధించారు.
ఫ మే 16, 17 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగిన సౌతిండియా జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో వర రామచంద్రపురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు మడకం సురేఖ కాంస్య, బంధం సరిత రజత పతకాలు సాధించారు. వారిద్దరూ గత ఫిబ్రవరిలో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సైతం సాధించడం విశేషం.
ఫ 2025 నవంబర్లో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) నిర్వహించిన 69వ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల చరిష్మా సాయిరుత్వి ఎంపికై ంది.
మరెందరో..
ఫ ఈ నెల 21 నుంచి 23 వరకూ శ్రీకాకుళంలో జరిగిన అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో కాకినాడ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది.
ఫ ఏప్రిల్ 22, 23 తేదీల్లో దేవరపల్లి మండలం రామన్నపాలెంలో జరిగిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది.
ఫ గత ఏడాది డిసెంబర్ 28న రావులపాలెం సమీపంలో వెదిరేశ్వరంలో జరిగిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు విజయబావుటా ఎగురవేసింది.
ఫ 2025 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో తూర్పు గోదావరి జట్టు ప్రథమ స్థానలో నిలిచి, ఐదు బంగారు పతకాలు సాధించింది.
ఫ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 15 వరకూ పాట్నాలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎటపాక మండలానికి చెందిన పీఈటీలు సోడె నాగిరెడ్డి, పెనుబల్లి లక్ష్మణరావు ఎంపికయ్యారు.
రేపు జాతీయ క్రీడా దినోత్సవం
న్యాయ నిర్ణేతలుగా..
ఫ గత జూన్లో కోనసీమ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆలమూరు మండలం కలవచర్లకు చెందిన మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ టి.అబ్బులు ఎంపికయ్యారు.
ఫ గత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఆగ్రాలో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలకు ఈదరపల్లికి చెందిన అడపా శ్రీనివాస్ న్యాయనిర్ణేతగా నియమితులయ్యారు.
ఫ గత ఏడాది ఆగస్టు 26 నుంచి 31 వరకూ పుణేలో జరిగిన ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు అమలాపురానికి చెందిన పీడీ పాయసం శ్రీనివాసరావు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఫ గత ఏడాది సెప్టెంబర్లో రంజీ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల ఎస్ఎస్ఎస్ శ్రీనివాస్ ఎంపికయ్యారు.
ఫ గోదారి నేలపై రాణిస్తున్న క్రీడాకారులు
ఫ అంతర్జాతీయ వేదికపై దుమ్ము రేపుతున్న సాత్విక్
ఫ మరెందరో ఆటగాళ్లకు ఉమ్మడి
‘తూర్పు’ వేదిక


