కరప: కూరాడలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఆ పీఏసీఎస్ భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు, రైతుల వినతి మేరకు 2023లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిధులు మంజూరు చేసి, అదే సంవత్సరం మే 13న కొత్త భవనానికి ప్రారంభోత్సవం చేశారు. కాగా.. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సీఈఓ బి.పరశురాముడు మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వెళ్లగా భవన ప్రారంభోత్సవ శిలాఫలకం ముక్కలై ఉంది. ఇదే విషయాన్ని పీఏసీఎస్ చైర్మన్ వెలుగుబంట్ల సూరిబాబుకు ఆయన తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే స్థానంలో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ సూరిబాబు చెప్పినట్టు సీఈఓ తెలిపారు. కాగా.. దీనిపై పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ రావుల ప్రసాద్ మాట్లాడుతూ దీనిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోకపోతే కార్యాలయం వద్ద రైతులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు. కూరాడ సచివాలయంపై ఏర్పాటు చేసిన వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రపటాలను 2024 జూన్ 10న ధ్వంసం చేశారన్నారు. ఇలాగే వదిలేస్తే గ్రామంలోని శిలాఫలకాలన్నింటినీ ధ్వంసం చేసే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు.


