వీఆర్పురం: ప్రతి మూడేళ్లకు ఒక్కసారి జరిగే గిరిజనుల జాతర మహోత్సవం కుర్రాజుల కొలుపులు మంగళవారం రేఖపల్లి గ్రామంలో ఘనంగా ముగిసింది. గిరిజనుల ఆరాధ్య దైవం కుర్రాజుల చిన్న దారులమ్మ, పెద్ద దారులమ్మ దేవతల జాతరను 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిప్పుల గుండం తొక్కి ఉత్సవాలను కుల పెద్దలు ఘనంగా జరిపారు. నాయకపోడు కొండరెడ్లతో కలిసి కనుల పండువగా జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. గిరిజనుల పండగ అయినప్పటికీ కులాలకు అతీతంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో జగన్నాథరావు పూజలు చేశారు. ఎస్సై సాదిక్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.


