
మాకు మా నాన్నే కావాలి!
ఫ అమ్మ చెంతకు వెళ్లం
ఫ లేకుంటే చంపేయండి
ఫ ఇద్దరు చిన్నారుల వేదన
రాజానగరం: ‘మా అమ్మ వద్దకు వెళ్లం, మమ్మల్ని మా నాన్నకు అప్పగించండి.. లేదంటే చంపేయండి. అమ్మకు అప్పగిస్తే చంపేస్తుంది’ అంటూ రోదిస్తూ ఇద్దరు చిన్నారులు అంటున్న మాటలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి వివాహేతర సంబంధంతో భర్తను వదిలేసి, ప్రియుడితో ఉంటోంది. ఆ ప్రియుడు ఆమె పిల్లలతో చాకిరీ చేయించుకుంటూ, ఇష్టానుసారం కొడుతున్నా ఆ తల్లి హృదయం చలించడం లేదు. కనీసం ఆ తల్లిని కన్న తల్లి కూడా చోద్యం చూస్తూ కూతురి వివాహేతర సంబంధాన్ని వెనకేసుకొస్తున్న నేపథ్యంలో ఆ చిన్నారులు విసిగిపోయారు. పై విధంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొంతమూరులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ..
కొంతమూరు చెంచు కాలనీలో ఉంటున్న అన్నెపు ధనలక్ష్మి, జయరామ్ దంపతులకు ఇద్దరు సంతానం. ప్రస్తుతం వీరిద్దరూ రాజమహేంద్రవరం ఆర్యాపురంలోని ఒక స్కూల్లో 4, 2 తరగతులు చదువుతున్నారు.
పెయింటర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న జయరామ్కు భార్య, పిల్లలంటే అమితమైన ప్రేమాభిమానాలున్నాయి. ధనలక్ష్మి ఒక కర్రీ పాయింట్లో పని చేస్తూండగా మందపల్లి ప్రవీణ్ కుమార్తో పరిచయం ఏర్పడింది. క్రమేపీ అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త, పిల్లలను పట్టించుకునేది కాదు. ఆమె ప్రవర్తనను సరి చేయాల్సిన తల్లి తులసమ్మ కూతురుకు వంత పాడి, అల్లుడు జయరామ్ను బయటకు పంపించేందుకు సాయపడింది.
సుమారు ఏడాది నుంచి ప్రియుడితో కలసి ఉంటున్న ధనలక్ష్మి ఎదుటనే ఆ ఇద్దరు పిల్లలతో ఆమె ప్రియుడు సేవలు చేయించుకునేవాడు. చెప్పినట్టు చేయకపోతే కొట్టేవాడు. ఈ క్రమంలో జనవరి 25న బెల్డుతో ఇష్టానుసారం కొట్టడంతో చుట్టుపక్కల వారి ద్వారా విషయం తెలుసుకుని మేనమామ పాలవలస బాలమణికంఠ అక్కడకు వెళ్లి, ఆ ఇద్దరు పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లాడు. ముందుగా రాజానగరం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. అప్పటి నుంచీ వారిని తన ఇద్దరు పిల్లలతో సమానంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ ధనలక్ష్మి పిల్లల గురించి పట్టించుకోకపోగా, వారి సంరక్షణ పేరుతో భర్త నుంచి నెలనెలా రూ.10 వేలు వసూలు చేస్తోంది. పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా వినియోగించకపోవడంతో స్కూలు ఫీజులు రూ.38 వేల వరకూ పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో పిల్లల మేనమామ మణికంఠ శుక్రవారం రాజానగరం పోలీసులను మరోసారి ఆశ్రయించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలు తమ తండ్రి వద్దకు వెళ్లిపోతామంటున్నారని ఈ సందర్భంగా మణికంఠ చెప్పాడు. అందుకు తమ బావ కూడా సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అధికారికంగా జరగాలని కోరుతున్నాడని అన్నాడు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సమక్షంలో వారిని తండ్రికి అప్పగిస్తేనే వారి భవిష్యత్తు బాగుంటుందన్నాడు.
ఇద్దరు చిన్నారులు
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో
నిర్ణయం తీసుకుంటాం
తండ్రి శ్రీకాకుళంలో ఉంటున్నాడు. అతనికి కబురు చేశాం. రెండు రోజులలో వస్తాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో తల్లిదండ్రులిద్దరినీ పెట్టి, పిల్లల వయస్సును బట్టి వారు ఎవరి వద్ద ఉండాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకుంటాం. లేకుంటే హోమ్కు అప్పగిస్తాం.
– నారాయణమ్మ, ఎస్సై,
రాజానగరం

మాకు మా నాన్నే కావాలి!

మాకు మా నాన్నే కావాలి!