పాలమూరు: పేదలు, సామాన్యులకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా సన్నగిల్లుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపీ సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత అత్యవసర సేవలకు సీనియర్ వైద్యుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు రాత్రివేళ ఆస్పత్రికి వస్తే నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
340లో 212 ఖాళీ
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎస్ఆర్, జేఆర్, ట్యూటర్లతో కలిపి 340 వైద్య పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 128 మంది మాత్రమే పనిచేస్తుండగా.. 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేస్తున్న వారిలో 67 మంది రెగ్యులర్, 61మంది కాంట్రాక్టు వైద్యులు ఉన్నారు. పరిపాలన, టెక్నికల్, నర్సింగ్, ఫార్మసిస్ట్ తదితర విభాగాల్లో 363 పోస్టులకు 235 మంది పనిచేస్తుండగా 128 ఖాళీగా ఉన్నాయి. ఔట్సోర్సింగ్లో 112 పోస్టులకు 95 మంది ఉండగా 17 ఖాళీగా ఉన్నాయి.
రాత్రివేళ జూనియర్లే..
కొంతమంది సీనియర్ వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఓపీ సమయంలో ఎస్ఆర్, జేఆర్, పీజీ వైద్యులు సేవలందిస్తుండగా.. రాత్రివేళ క్యాజువాలిటీలో హౌజ్ సర్జన్లపైనే ఆధారపడాల్సి వస్తోందని రోగుల బంధువులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థో విభాగం నుంచి రాత్రి అత్యవసర సేవలకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండాల్సి ఉన్నా ఆ విధానం అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆర్థోలో 15 ఖాళీలు
ఆర్థో విభాగంలో 25 పోస్టులకు గాను 10 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో అవసరమైన పరికరాలు లేక కొన్ని సర్జరీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న రూ.15 లక్షల సీ–ఆర్మ్ యంత్రం, రూ.3 లక్షల ఆర్థో డ్రిల్ మిషన్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక సర్జరీలు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వరుస ఘటనలతో కలవరం
ఆస్పత్రిలోని కొన్ని విభాగాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఇంజక్షన్ మార్పిడి ఘటనలో యువకుడు మృతి చెందగా.. తాజాగా శిశువు తొడలో సూది విరిగిన ఘటన కలకలం రేపింది. వార్డుల్లో సిబ్బంది ప్రవర్తనపైనా ఫిర్యాదులు వస్తున్నాయి.
చిన్న కేసులకూ రెఫరల్?
అత్యవసర, క్లిష్ట కేసులను రెఫర్ చేయడం సమంజసమే అయినా.. పాము కాటుకు గురైన వ్యక్తిని సైతం ఉస్మానియాకు తరలించడం చర్చనీయాంశమైంది. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెన్నయ్య ఈ నెల 22న పాము కాటుకు గురికాగా కుటుంబసభ్యులు జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐదు రోజుల చికిత్స అనంతరం బుధవారం ఉస్మానియాకు తరలించారు. కాగా.. ఆస్పత్రిలో పాము కాటుకు విరుగుడు కంటే ముందు ఇచ్చే ఇంజక్షన్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కావాల్సిన డ్రగ్స్, మెరుగైన చికిత్స విధానం అందుబాటులో లేక చాలా వరకు కేసులు హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి.
ప్రధాన విభాగాల్లో శస్త్రచికిత్సలకు
రోగుల నిరీక్షణ
మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్లు.. రాత్రివేళ హౌజ్ సర్జన్లతోనే వైద్యం
340 వైద్య పోస్టుల్లో 212 ఖాళీలు..
జనరల్ ఆస్పత్రిలో కలవరపెడుతున్న
వరుస ఘటనలు


