గద్వాల: పంట మార్పిడి విధానాలతోనే రైతులు అధిక లాభాలు సాధించవచ్చని, ప్రస్తుతం ఎల్నిన్ ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండడంతో రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో రైతులు కాల్వల ద్వారా సాగునీటిపై ఎక్కువగా ఆధారపడకుండా కూరగాయలు, పప్పుదినుసులు వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగుచేయాలన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటలు సాగుచేయని రైతులు రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల వరివిత్తనాలకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా బోనస్ చెల్లించడం జరుగుతుందని ఇప్పటికే ప్రకటించినందున అధికారులు ఆ రకాలు సాగుచేసిన రైతుల వివరాలను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. సాధారణ యూరియాను అధిక మొత్తంలో వినియోగించడం వల్ల భూమి సారవంతం కోల్పోతుందని దీని స్థానంలో రైతులు నానో యూరియాను వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలతో మహిళా రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కూడా ఎరువుల పిచికారీకి వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే శాతం పెరగాలని, రైతు బీమా దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లెయిం చేయాలని సూచించారు. పీఎండీడీకేవై పారామీటర్స్లో ఉన్నతి సాధించేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించాలని, ప్రతి గ్రామం నుంచి చాంపియన్ ఫార్మర్స్ గురించి డాటా పంపాలన్నారు. వనమహోత్సవం విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిగార్డెన్స్కు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఏఓ వీరప్ప, ఉద్యావనశాఖ అధికారి రాజ్కుమార్, ఇఫ్కో మేనేజర్ కృపాశంకర్, సీనియర్ శాస్త్రవేత్త గిరిజాదేవి తదితరులు పాల్గొన్నారు.
పనితీరు మెరుగుపర్చుకోవాలి
ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపర్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వెబ్ఎక్స్ మీట్ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఈఓలు, హెచ్ఎంలు పాఠశాలల సందర్శనలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి ప్రసాద్, కోఆర్డినేటర్ కర్రెప్ప, మైఖేల్ తదితరులు పాల్గొన్నారు.


